వాషింగ్టన్,: పశ్చిమాసియా యుద్ధం కీలక అంకానికి చేరుకుంది. నెల రోజులపాటు యుద్ధం సాగిస్తున్నా లొంగని ఇరాన్ను తుది దెబ్బతీయడానికి అగ్రరాజ్యం అమెరికా సిద్ధపడుతున్నది. ఇరాన్ గడ్డపై భూతల దాడులు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నది. 3,500 మంది మెరైన్లు, సైనికులతో అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీ ఈ నెల 27న పశ్చిమాసియాకు చేరుకుంది. జపాన్లో విన్యాసాలు చేస్తున్న ట్రిపోలి యుద్ధనౌకను పశ్చిమాసియాకు తరలించారు. ఎన్ని దాడులు చేసినా ఇరాన్ లొంగే పరిస్థితి కన్పించకపోవడంతో ఆఖరి అస్త్రంగా భూతల దాడులు చేయడానికి అగ్రరాజ్యం సిద్ధమైంది.
సైనికుల మోహరింపును యూఎస్ సెంట్రల్ కమాండ్ నిర్ధారించింది. ట్రంప్ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, అనుమతి రాగానే దాడులు ప్రారంభిస్తామని తెలిపింది. కాగా, 844 అడుగుల పొడవుండే ట్రిపోలి నౌక 20 నాటికల్ మైళ్ల వేగంతో పయనిస్తుంది. 44 వేల టన్నుల బరువును మోసుకుపోగల ఈ నౌక ఒకే సమయంలో 20 ఎఫ్-358 స్టెల్త్ ఫైటర్లు, ఎంవీ-22 ఆస్ప్రే విమానాలు, హెలికాప్టర్లను మోసుకుపోగలదు. కాగా, ఇరాన్పై భూతల దాడికి పెంటగాన్ కొన్ని వారాల నుంచి సిద్ధమవుతున్నదని, అమెరికా అధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ కార్యాచరణలో ప్రత్యేక దళాలు, సాధారణ దళాలు కూడా ఉన్నాయి. అయితే ట్రంప్ ఏ ప్రణాళికకు ఆమోదం తెలుపుతారన్నది నిర్ధారణ కాలేదని పేర్కొన్నది.