మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై పొన్నం ఆక్షేపణ
వార్తాపత్రిక, హైదరాబాద్, జూన్10: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజ్యసభ ఎన్నికల వంటి కీలక ప్రజాస్వామ్య ప్రక్రియలో నామినేషన్ను తిరస్కరించడం ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలకు తావిస్తుందని అన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై ఎలాంటి కేసులు నమోదు కాలేదని, విచారణలకు హాజరైన సందర్భం కూడా లేదని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆమెపై ఉన్నాయని చెబుతున్న కేసుల వివరాలను వెల్లడించలేదనే కారణంతో నామినేషన్ను తిరస్కరించడం సమంజసం కాదన్నారు. ఈ వ్యవహారంలో రాజకీయ కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. నామినేషన్ తిరస్కరణ అంశంపై అందుబాటులో ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకుంటామని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత కోసం అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.