Banner
Watermark
కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై బీజేవైఎం ధర్నా
📅 10 June 2026, 11:08 AM ✍️ admin
News Image
వార్తాపత్రిక, హైదరాబాద్, జూన్ 10: కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర శాఖ మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. ఫీజుల దోపిడీని అరికట్టి విద్య హక్కు చట్టం, ఫీజుల నియంత్రణ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా ఫీజుల నియంత్రణపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. హరీశ్వర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, సందీప్ గౌడ్, నితిన్ నందకర్, శరత్ చంద్ర, సాయినాథ్, రాష్ట్ర కార్యదర్శులు శివచంద్రగిరి, అరవింద్ రెడ్డి, హరిప్రసాద్, వరప్రసాద్ రెడ్డి, ఝాన్సీ, రాష్ట్ర కోశాధికారి నరేన్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
🏠 Home