Banner
Watermark
అర్హులైన ప్రతి కౌలు రైతు ధ్రువీకరణ పత్రం దరఖాస్తులు చేసుకోండి:
📅 23 April 2026, 05:31 PM ✍️ M.Chinna
News Image
వ్యవసాయ అధికారి సురేష్ బాబు
తుగ్గలి ఏప్రిల్ 23 (వార్తాపత్రిక):-రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల ప్రయోజనాలు అందుకోవాలంటే కౌలు రైతులు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం పొందాలని వ్యవసాయ అధికారి సురేష్ బాబు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కౌలు రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో తమ దరఖాస్తులను వెంటనే సమర్పించాలని సూచించారు.కౌలు రైతులు సాగు చేస్తున్న భూమికి సంబంధించి సరైన ధ్రువీకరణ పత్రం లేకపోతే ప్రభుత్వం అందిస్తున్న ఇన్పుట్ సబ్సిడీలు, పంట బీమా, ఇతర ఆర్థిక సహాయాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. అందువల్ల అర్హులైన ప్రతి కౌలు రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
దరఖాస్తు చేసుకునే సమయంలో రైతులు తమ ఆధార్ కార్డు, భూమి యజమాని ఒప్పంద పత్రం, సాగు వివరాలు వంటి అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది పూర్తి సహకారం అందిస్తారని, ఎలాంటి సందేహాలు ఉన్నా అక్కడే నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.ప్రభుత్వం కౌలు రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని, ధ్రువీకరణ పత్రం ద్వారా వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని ఏవో సురేష్ బాబు పేర్కొన్నారు. రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
🏠 Home