Banner
Watermark
మహనీయుల ఆశయాలు సిద్ధాంతాలే సామాజిక న్యాయం మార్గదర్శకాలని జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్
📅 04 February 2026, 05:02 PM ✍️ M.Chinna
News Image
వార్త పత్రిక; భద్రాద్రి కొత్తగూడెం
మహనీయులు ప్రతిపాదించిన ఆశయాలు, సిద్ధాంతాలే సామాజిక న్యాయం సాధించేందుకు మార్గదర్శకాలని జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అన్నారు. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మ గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతిరావు ఫూలే చిత్రపటాలకు జిల్లా అదనపు కలెక్టర్ పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో సమానత్వం సాధించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎంతో కీలకమని అన్నారు. కుల సర్వే నిర్వహణతో పాటు షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సమాజంలోని వెనుకబడిన చివరి వ్యక్తికీ తగిన వనరులు, ప్రాతినిధ్యం మరియు ఆత్మగౌరవం కల్పించేందుకు దోహదపడతాయని తెలిపారు. సామాజిక న్యాయం సాధించాలంటే మహనీయులు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అందరి అభ్యున్నతే లక్ష్యంగా మహాత్మ గాంధీ కలలుగన్న “సర్వోదయం” భావన, అణగారిన వర్గాల విద్య, గౌరవం కోసం మహాత్మ జ్యోతిరావు ఫూలే చేసిన పోరాటం, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డా|| బి.ఆర్. అంబేద్కర్ బోధించిన సామాజిక ప్రజాస్వామ్య విలువలు ప్రతి పౌరునికీ నిరంతర ప్రేరణగా నిలుస్తాయని తెలిపారు. ఈ విలువలను ఆచరణలోకి తీసుకువచ్చినప్పుడే సమానత్వం, న్యాయం సాకారమవుతాయని స్పష్టం చేశారు. అనంతరం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారులు, సిబ్బందితో కలిసి సామూహిక ప్రతిజ్ఞ చేశారు. వివక్ష లేకుండా ప్రతి వ్యక్తిని గౌరవిస్తామని, సమానత్వం, న్యాయం మరియు గౌరవం కోసం నిలబడతామని, ఏ రూపంలోనైనా అన్యాయాన్ని సమర్థించబోమని ప్రతిజ్ఞ చేశారు. దయ, సానుభూతితో సమాజంలోని ప్రతి ఒక్కరినీ చూడడంతో పాటు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తమ గళాన్ని వినిపిస్తామని తెలిపారు. రాజ్యాంగ సూత్రాలను పరిరక్షిస్తూ, న్యాయమైన, సామరస్యపూర్వకమైన మరియు సాధికారత కలిగిన తెలంగాణ రాష్ట్రం, భారతదేశ నిర్మాణానికి కృషి చేస్తామని వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి అనంత రామకృష్ణ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సంజీవరావు, జిల్లా సహకార శాఖ అధికారి ఎ. శ్రీనివాస్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, పౌరసరఫరాల శాఖ మేనేజర్ ఎస్. త్రినాథ్ బాబు, అన్ని శాఖల జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
🏠 Home