వివేకానంద జీవితం భారతదేశానికి ఆదర్శం కావాలి: ఆకుల సతీష్
హైదరాబాద్, ప్రగతి నగర్: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రగతి నగర్ మోర్ సూపర్ మార్కెట్ సర్కిల్ వద్ద స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆకుల సతీష్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. సనాతన హిందూ ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు.
దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషిస్తుందని, యువతలో ఉండాల్సిన లక్షణాలు, నీతి, నిజాయితీ, దేశభక్తిని స్వామి వివేకానంద తన ఉపన్యాసాలు, రచనల ద్వారా బోధించారని అన్నారు. అందుకే ఆయన జయంతి జనవరి 12ను దేశవ్యాప్తంగా యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా చికాగోలో ఇచ్చిన ఉపన్యాసం ద్వారా భారతదేశ హిందూ ధర్మం విశిష్టతను ప్రపంచానికి చాటిన వ్యక్తిగా వివేకానంద నిలిచారని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో యువత పెడదారున పడకుండా ఉండాలంటే స్వామి వివేకానంద బోధనలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేయాలని ఆకుల సతీష్ సూచించారు. అలాగే అతి త్వరలో ప్రగతి నగర్ మోర్ సూపర్ మార్కెట్ సెంటర్లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అమలేశ్వరి, అరుణ్ రావు, ఎల్ల స్వామి, మురళి, కృష్ణ, పండు తదితరులు పాల్గొన్నారు.